పనాజి, మార్చ్ 20: నేడు గోవా అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సర్కార్ గెలిచింది. శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ప్రమోద్ కు 19 సభ్యులు మద్దతు అవసరం ఉండగా.. ఆయన సర్కార్ ను 20మంది సభ్యులు బలపరిచారు. దీంతో గంట సేపట్లోనే సావంత్ తన బలం నిరూపించుకోగలిగారు. అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అయితే అందులో కాంగ్రెస్ కు చెందిన 14మంది సభ్యులు మినహా అందరు బీజేపీకి మద్దతు తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా బుధవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నుంచి సొంతంగా 12 మంది సభ్యులుండగా.., గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి చెందిన ముగ్గురేసి సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు తమకు మద్దతునిస్తున్నారని పేర్కొంది. మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతి, బీజేపీకి చెందిన ఒకరు, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయడంతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 19 మంది సభ్యుల మద్దతు లభిస్తే ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బయటపడుతుంది. సభలో 14 మంది సభ్యులతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగానుండగా, ఎన్సీపీకి కూడా ఒక సభ్యుడున్నారు. అయితే ఇవాళ విశ్వసపరీక్షలో సీఎం సావంత్కు 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.