న్యూఢిల్లీ, మార్చ్ 12: ఏప్రిల్ 11 న ప్రారంభమై మే 19 న ముగియనున్న పార్లిమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు విషయం పక్కన పెడితే దీనికయ్యే ఖర్చు మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఎన్నికలకు దాదాపు రూ.50,000 కోట్ల (7 బిలియన్ డాలర్లు) వ్యయం కానుందని సెంటర్ పర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా వేసింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు (6.5 బిలియన్ డాలర్లు) కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. కాగా 2014 లోక్సభ ఎన్నికల ఖర్చు 5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. సోషల్ మీడియా, ట్రావెల్, అడ్వర్టైజింగ్ ఖర్చు భారీగా పెరిగే అవకాశముందని సీఎంఎస్ అంచనా వేసింది. 2014లో రూ.250 కోట్లుగా ఉన్న సోషల్ మీడియా వ్యయాలు ఇప్పుడు రూ.5,000 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. పార్టీ లీడర్లు, అభ్యర్థుల ట్రావెల్ ఖర్చులు కూడా విపరీతంగా పెరగొచ్చని తెలిపింది.