తిరువనంతపురం, మార్చి 8: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి బంగారం పూతతో తలుపులు చేయిస్తున్నారు. వచ్చే వారం పూజల కొరకు ఆలయాన్ని తెరవనున్నారు. అప్పటి వరకు బంగారు తలుపులు తాయారు అవుతాయని ఆలయ కమిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గర్భ గుడి ద్వారాలు దెబ్బ తిన్నాయని, మార్చి 11న సోమవారం రాత్రి ఈ తలుపులను మార్చుతున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన ఆలయా తలుపుల్ని అత్యంత నాణ్యమైన టేకు తో తాయారు చేయిస్తున్నారు. ఆ తలుపుల పైన పూతల నాలుగు కిలోల బంగారాన్ని తాపడం చేయబోతున్నారు. కొంత రాగిని కూడా ఇందులో ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అయ్యప్ప ఆలయం, ఆ పరిసర ప్రాంతాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఇక బంగారు తాపడం కూడా చేస్తే ఆలయం మరింత అందంగా మెరిసిపోతుంది.
నెలవారీ పూజల కోసం మార్చి 11న ఆలయాన్ని తెరవబోతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సందర్శనం కోసం 11 రోజులు తెరుస్తున్నారు. ఈ సమయంలో రోజు పూజలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తలుపుల్ని ఎలాంపల్లి ధర్మశాల దేవాలయం నుండి తేస్తున్నారు. తలుపుల్ని మార్చి 10న ప్రదర్శనగా తీసుకొస్తారు. సన్నిధానం దగ్గర ఆ తలుపుల్ని అధికారులు తీసుకుంటారు. వాటిని ముందుగా పరిశీలించి తర్వాత ఆలయానికి సెట్ చేస్తారు. ఈ నెల 21న ఆలయాన్ని మూసివేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆలయ తలుపులు దెబ్బతింటే బంగారు తాపడాన్ని తొలగిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. మార్చి 11న ఆలయాన్ని తెరుస్తుండటంతో ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లలో లీనమయ్యారు.