జైపూర్, మార్చ్ 06: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో శతృదేశమైన పాకిస్తాన్ లోకి వెళ్లి నిర్భయంగా తిరిగి స్వదేశానికి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దీంతో అభినందన్ సాహస గాథను రాజస్థాన్ విద్యార్ధులు ఇకపై పాఠ్యాంశంగా చదువుకోనున్నారు. అభినందన్ స్టోరీని స్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్ర ప్రతిపాదించారు. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ జోధ్పూర్లోనే విద్యాభ్యాసం చేసినట్లు మంత్రి గోవింధ్ ఇవాళ ట్విట్టర్లో పేర్కొన్నారు. వైమానిక దాడుల సమయంలోనూ, ఆ తర్వాత అభినందన్ కనబర్చిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆయనను గౌరవించేందుకే రాజస్థాన్ స్కూల్ సిలబస్లో అభినందన్ జీవిత చరిత్రను పొందుపర్చనున్నట్లు వెల్లడించారు. అయితే మంత్రి చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే రివ్యూ కమిటీ నుంచి ఆమోదం లభించింది.