ముంబై, మార్చి 05: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో మై హూ హీరో తేరా సినిమాలో ఒక పాటను పాడారు. ఆయన పడిన పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు మరోసారి సింగర్ గా మారనున్నాడు సల్మాన్. దీనికి కారణం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీసుకున్న సంచలన నిర్ణయమే. పాకిస్థాన్కి చెందిన నటీనటులు, సింగర్స్ని పూర్తిగా నిషేధించాలని వారు చెప్పడంతో మేకర్స్ ఒక్కొక్కరుగా తమ సినిమాలో పని చేస్తున్న పాక్ కళాకారులని తొలగించి కొత్త వారిని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న నోట్ బుక్ సినిమా నుండి ప్రముఖ పాకిస్తానీ సింగర్ అతీఫ్ అస్లామ్ని తొలగించాడు. ఆయన స్థానంలో వేరే గాయకుడికి తీసుకోవాలని భావించారు. కానీ చివరికి సల్మాన్ వాయిస్ పాటకి సరిగ్గా సరిపోవడంతో ఆయననే పాడమని చిత్ర బృందం కోరారట. దీనికి సల్మాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న సల్మాన్ వచ్చే నెలలో దబంగ్ షూటింగ్ కోసం దుబాయ్కి వెళ్లనున్నాడు. ఆ లోపు ఈ పాటను రికార్డు చేయనున్నారు. నోట్ బుక్ సినిమా మార్చి 29న విడుదల కానుంది.