న్యూఢిల్లీ, మార్చి 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్లోని పాట్నాలో నిర్వహించిన ఎన్డీయే సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో విమర్శించారు. తాను ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల కూటమి తనను అంతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నరంటూ విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాల తీరు పాకిస్థాన్కు సానుకూలంగా ఉందన్నారు. ఉగ్రవాద ఆరోపణల నుండి తప్పించుకునేందుకు పాకిస్థాన్కు మన ప్రతిపక్ష నేతల ప్రకటనలు చక్కగా ఉపయోగపడుతున్నాయన్నారు. వీరి ఆరోపణలకు వారు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
పేదల సంక్షేమం పేరిట రాజకీయ దుకాణాలు నడుపుకుంటూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం తప్ప ఇంకేమీ చేయని కొందరు నాయకులకు కాపలాదారులతో సమస్యేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ను ఉద్దేశించి విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్లు కలిసి బీహార్ను చీకటి రోజుల నుంచి బయటపడేశారని, వారికి అభినందనలు తెలుపుతున్నట్టు మోదీ పేర్కొన్నారు.