లక్నో విమానాశ్రయంలో అఖిలేశ్‌ను అడ్డుకున్న యోగి ప్రభుత్వం

SMTV Desk 2019-02-13 09:12:59  Akhilesh Yadav, SP, Uttar Pradesh, Yogi Adhithyanath, Alahabad University, Mayawati, BSP, Luknow Airport

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు చెడు అనుభవం ఎదురైంది. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేత ప్రమాణ స్వీకారోత్సవంనికి హాజరయ్యేందుకు వెళ్తున్న అఖిలేశ్‌ను మంగళవారం పోలీసులు లక్నో విమానాశ్రయంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు విమానాశ్రయం బయట, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీకి దిగారు.

ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ స్పందిస్తూ అఖిలేశ్‌ అలహాబాద్‌ వర్సిటీకి వెళ్తే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనే లక్నో విమానాశ్రయంలో ఆపినట్లు తెలిపారు. అఖిలేశ్‌ను అలహాబాద్‌ రాకుండా అడ్డుకోవాలని వర్సిటీ యాజమాన్యమే కోరిందని, అందుకోసమే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. కాగా, విమానాశ్రయంలో తనను అడ్డుకోవడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని అఖిలేశ్‌ ఆరోపించారు.

ఈ క్రమంలో అఖిలేశ్‌ మాట్లాడుతూ, యోగి ప్రభుత్వం భయపడుతుందని, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. కాగా, అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ఘటనను ఖండించారు. అఖిలేశ్‌ను విమానాశ్రయంలో అడ్డుకున్నారన్న సంగతి తెలియగానే ఎస్పీ కార్యకర్తలు అలహాబాద్, ఝాన్సీ, కనౌజ్, బలరాంపూర్, జలాన్, అజాంగఢ్, గోరఖ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల అద్దాలు పగలగొట్టి, పోలీసులతో ఘర్షణలకు దిగారు.