హైదరాబాద్, ఆగష్టు 3: మహిళా క్రికెట్ 2017 ప్రపంచ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి భారత జట్టు ఫైనల్స్లో ఓటమి పాలైన విషయం విదితమే. ఇటీవల భారత మహిళా జట్టు సారధి మిథాలీ రాజ్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వరల్డ్ కప్ ఫైనల్కు తీసుకెళ్లిన ఆనందం కంటే 2005లో ఫైనల్స్కి వెళ్లిన సంఘటనే బాగా జ్ఞాపకం ఉంటుందని ఆమె తెలిపారు. అప్పుడు మా జట్టుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. బీసీసీఐ మాకు సహాయం చేయలేదు మా స్వంత కృషితో మేం ఫైనల్స్ వరకు చేరాం. ఆ మ్యాచ్లో 98 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామని ఆమె చెప్పారు. గతంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా, ఈ ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టును సెమీ ఫైనల్లో ఓడించడం చాలా ఆనందంగా ఉందని మిథాలీ తెలిపింది. బీసీసీఐ అండ ఉండటంతో ఫైనల్ జట్టుపై ఒత్తిడి పెరిగింది, ఆ కారణంగా ఓడిపోవాల్సి వచ్చిందని మిథాలీ చెప్పారు. తన తరువాతి లక్ష్యాలు టీ20 వరల్డ్ కప్తో పాటు మరో రెండు అంతర్జాతీయ టోర్నీలని మీడియాతో పంచుకున్నారు.