హైదరాబాద్, ఫిబ్రవరి 07: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా మహర్షి . ఈ సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్గా, సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా, ఆధునిక రైతుగా ఆయన దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు త్వరలోనే పట్టాలెక్కనున్న తన 26వ చిత్రంలోనూ ఇదివరకు చేయని ఓ పాత్రని చేయబోతున్నాడట ఈ టాలెంటెడ్ హీరో.
అందిన సమాచారం ప్రకారం `1 నేనొక్కడినే` విడుదలైన ఐదేళ్ళ గ్యాప్ తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూపర్ స్టార్ ఓ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర అయినప్పటికీ `పోకిరి` తరహాలో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఈ క్యారెక్టర్లో ఉంటాయని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమా 2020 వేసవికి తెరపైకి రానుంది.