న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఈరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. బుధవారం నాడు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ, నేడు మళ్లీ రావాలంటూ నోటీసులు జారి చేసింది. వాద్రా పరారీలో ఉన్న ఆయుధ వ్యాపార డీలర్ సంజయ్ భండారీ ద్వారా లండన్లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ భావిస్తోంది.
మనీలాండరింగ్ చేశారనే అనుమానంతో ఆయన్ను ఈడీ విచారణకు పిలిచింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు నాలుగు గంటల పాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ, లండన్లోని వివిధ ఆస్తుల కొనుగోళ్ళకు, లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను పరిశీలించినట్టు సమాచారం. కాగా, వాద్రా తరపు లాయర్ సుమన్ ఖైతాన్ మాత్రం ఈడీ చర్యలను ఖండించారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే విచారిస్తున్నారని ఆరోపించారు.