అమరావతి, ఫిబ్రవరి 06: ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనత పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ని విమర్శించారు. అమిత్ షా కుమారుడి ఆస్తులు గతం లో కన్నా ఇప్పుడు 16వేల రెట్లు పెరిగాయని, అయిన కూడా ఒక్క విచారణ కూడా జరపలేరని విరుచుపడ్డారు. విపక్ష నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను దాడిచేయిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల కింద మీరు ఎక్కడున్నారని, ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నించారు. తనను విమర్శించే నైతికత అమిత్ షాకు లేదని చెప్పారు. కావాలంటే బీజేపీని పొగుడుకోవాలని, తనను విమర్శించే హక్కు మాత్రం మీకు లేదని అన్నారు.
గత ఎన్నికలలో ఇద్దరం కలసి పని చేద్దామని మోదీయే తనను అడిగారని, ఇప్పుడు బీజేపీతో కలస్తామని మేము అడుక్కున్నట్టు అమిత్ షా అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు ఉన్నది విలువలతో కూడిన పాత బీజేపీ కాదని, మోదీ, అమిత్ షాల బీజేపీ అని అన్నారు. రాష్ట్రానికి ఉపకారం చేయమని అడిగితే, తమపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పెళ్లాన్నే సరిగా చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని నితిన్ గడ్కరీనే అన్నారని ఎద్దేవా చేశారు. పలాసలో జరిగిన అమిత్ షా సభకు జనాలే లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనది యూ టర్న్ కాదు రైట్ టర్న్ అని, బీజేపీనే వంకరటింకర టర్న్ లు తీసుకుంటోందని విమర్శించారు. తన కుమారుడి పదవి కోసం తాను ఏదేదో చేస్తున్నానని అంటున్నారని, తనకు అంత అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అక్కచెల్లెల్లతో తనది జన్మజన్మల బంధమని తెలిపారు.