బెంగుళూరు, ఫిబ్రవరి 5: కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల ఎనిమిదో తేదీన ప్రవేశపెట్టనున్నరు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో మీడియా తో మాట్లాడుతూ, తమ బడ్జెట్లో ఎటువంటి ప్రలోభాలు ఉండవని, కేంద్ర బడ్జెట్లా మాయాజాలం చేయబోనని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ లోటస్’ను బీజేపీ నేతలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, వారికి తన నుంచి ఎటువంటి అడ్డంకులు ఉండబోవన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి దేశ ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారని కుమారస్వామి తెలిపారు. అలాంటి పరిస్థితి తన రాష్ట్ర ప్రజలకు రానివ్వబోనన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తానన్న మోదీ సాధించింది ఏమి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల ఆశ చూపి కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోందని కుమారస్వామి ప్రశ్నించారు.