కోల్కతా, ఫిబ్రవరి 2: కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఐదెకరాలు గల రైతులకు ప్రతి ఏటా ఆరువేల రైతు సాయంను అందిస్తామని కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీకొట్టిందని, వాటి పేర్లునే మార్చి కొత్తగా ప్రకటించారని ఆమె మండిపడ్డారు. కేంద్రం ఇస్తామన్న రైతు సాయం తమకు వద్దని, అరకొర సాయం తమకు అవసరంలేదని మమత తేల్చి చెప్పారు.
సమాఖ్య వ్యవస్థను బిజెపి నేతలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మమత విమర్శించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నందునే కేంద్ర ఈ ప్రజాకర్ష బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీన్ని ఎన్డిఏ ఎన్నికల వ్యూహంగా ఆమె వర్ణించారు. మోడీ ప్రభుత్వానికి కాలం తీరిందని, ఎన్డిఏ సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ చెల్లదని వ్యాఖ్యానించారు.