న్యూ ఢిల్లీ, జనవరి 29: కవి అప్పరసు, సీనియర్ పాత్రికేయుడు ఆంద్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమి అనువాద అవార్డుకు ఎంపికయ్యారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మశ్రీ పద్మా సచ్ దేవ్ రాసిన కవితలను "గుప్పెడు సూర్యుడు.. మరిన్ని కవితలు" పేరిట తెలుగులో అనువదించినందుకు గాను ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ విభజన సమయం లో తండ్రిని కోల్పోయిన కవయిత్రి తను ఎదుర్కొంటున్న మానసిక వేదనను, భారతీయ మహిళలు ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులను, సుఖ దుఃఖాలను తన కవితల్లో వర్ణించగా.. వాటిని కృష్ణారావు తెలుగులోకి అద్బుతంగా అనువదించారాని ప్రశంశించారు. కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్ ఈ కవితలను ఇంగ్లీష్ లోకి అనువదించగా, కృష్ణారావు తెలుగు లోకి అనువదించారు. ఈ పురస్కారం కింద కృష్ణారావుకు రూ. 50 వేల నగదు, ప్రశంశ పత్రం బహుకరించనున్నారు. 1962వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం వింజమూరు గ్రామం లో కృష్ణారావు జన్మించారు. ఈయనకు ఈ అవార్డు దక్కడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.