న్యూఢిల్లీ, జనవరి 23: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ హైకోర్టులలో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇదే నేపథ్యంలో ఈబీసీ బిల్లును సవాల్ చేస్తూ బీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఈశ్వరయ్య ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి అధ్యయనం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టి కేంద్రంపై వొత్తిడి తెస్తామని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కాగా రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన ఉద్దేశించిన కార్యక్రమం కాదని సామాజికంగా వెనుకబడి, ఎన్నో దశాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం ఈ రిజర్వేషన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ బిల్లుపై ఎన్ని పిటీషన్లు దాఖలు అవుతాయో వేచి చూడాలి.