పొత్తులకు ద్వారాలు తెరిచే ఉంటాయ్: మోదీ

SMTV Desk 2019-01-11 15:31:50  Narendra Modi, loksabha elections, BJP, Regional parties, Video conference

చెన్నై, జనవరి 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో తమిళనాడులోని బీజేపీ నేతలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, పాత మిత్రులను తాము గుర్తుపెట్టుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని మోదీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అరక్కోణం, కడలూరు, కృష్ణగిరి, ఈరోడ్, ధర్మపురి జిల్లాల బీజేపీ నేతలతో మోదీ మాట్లాడారు. తమిళనాడులో ఉన్న పార్టీల్లో దేనితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వొకరు అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని సమాధానమిచ్చారు.

ప్రాంతీయ పార్టీలకు, వారి ఆకాంక్షలకు అటల్‌జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే భాజపా వెళ్తోంది. వాజ్‌పేయి చేసిన దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు మాత్రమే హక్కు ఉందని ఆ పార్టీ భావిస్తుందని విమర్శించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని ఐదు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 39 స్థానాల్లోనూ పోటీ చేయగా ఈ కూటమి రెండే సీట్లు (బీజేపీ, పీఎంకే చెరొకటి) గెలిచింది. తర్వాత ఈ 5 పార్టీలూ బీజేపీతో తమ సంబంధాలను తెంచుకున్నాయి.