అస్సాం, జనవరి 8: నగరంలోని ప్రముఖ ఐఐటీ గౌహతిలో ఏపీకి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల ప్రకారం ఐఐటీ క్యాంపస్లోని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పన్నెం పవన్ సిద్ధార్థ అక్కడి హాస్టల్లోనే నివసిస్తున్నాడు. తరచూ కుటుంబసభ్యులతో తన క్షేమ సమాచారాలను ఫోన్ ద్వారా తెలిపే.. పవన్ సోమవారం సాయంత్రం స్పందించలేదు. అతనికి ఫోన్ చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ పవన్ ఎంతసేపటికీ లిఫ్ట్ చేయలేదు.
దీంతో వారు అతని స్నేహితులకు ఫోన్ చేయగా.. వారు సిద్దార్థ గదికి వెళ్లి చూడగా అతను ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో స్నేహితులు సిద్ధార్థను ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.