భువనేశ్వర్, జూలై 28 : భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థంగా ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ కు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలాం పేరు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం అధికారికంగా మీడియాకు ప్రకటించారు. భారతదేశ క్షిపణి ప్రయోగాలకు వేదికగా వీలర్ ఐలాండ్ను తీర్చిదిద్దడంలో కలాం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఒడిషాకే తలమానికంగా వీలర్ ఐలాండ్ను మార్చారన్నారు. అందుకే కలాంకు నివాళులర్పించే రీతిలో ఐలాండ్కు ఆయన పేరు పెట్టామన్నారు. తద్వారా ఆయన ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోతారని నవీన్ పట్నాయక్ వివరించారు. ఇందుకు సంబంధించి గురువారం కేంద్రం ఆమోదం తెలపగా, ఆ వెంటనే రాష్ట్ర రెవెన్యూశాఖ గెజిట్ విడుదల చేసింది.