చండీగఢ్, డిసెంబర్ 26: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చండీగఢ్ లూథియానాలోని ఇద్దరు స్థానిక యువకులు రంగు పులమడం సంచలనమైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు వెంటనే ఆ విగ్రహాన్ని శుభ్రపరిచారు. 1984లో సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆ యువకులు డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది శిరోమణి అకాలీదళ్ పార్టీ పనే. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్వీర్ సింగ్ బాదల్ క్షమాపణ చెప్పాలన్నారు. అకాలీదళ్ ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే వచ్చే లోక్సభలో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఆ అల్లర్లకు గాంధీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబానికి చెందిన వారి పేర్లను బలవంతంగా అందులో ఇరికించారు అని అన్నారు.