హైదరాబాద్, డిసైబర్ 22: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల శారీరక అనారోగ్యం, శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి మానసిక వొత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి ఇంకా ఇతర కారణాల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో ప్రతి సంవత్సరం ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల ఆదాయ రాబడి తగ్గుతోందట. బెంగళూరులోని పది పెద్ద ఐటీ కంపెనీలలోని కొంత మంది ఉద్యోగులను రెడ్సీర్ కన్సల్టింగ్ సంస్థ ఇంటర్వ్యూ చేసి ఈ అధ్యయనం జరిపింది. ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ట్రీ లాంటి భారతీయ కంపెనీలకు ప్రపంచ హెడ్ క్వాటర్స్ ఇక్కడ ఉండగా, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు భారతీయ హెడ్ క్వాటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి.
దేశం మొత్తం మీద ఐటీ పరిశ్రమలో 165 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, వొక్క బెంగళూరు నగరంలోనే ఏడాదికి 50 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఉద్యోగుల అనారోగ్యం, అపసవ్య జీవన శైలి తదితర కారణాల వల్ల నగరంలోని మొత్తం రెవెన్యూలో ఏడు శాతం నష్టపోతున్నారు. సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల బలహీనత సమస్యలకు గురవుతున్నారు.
ఇదివరకు ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసానికి అట పాటలకు క్యాంపస్లోనే సౌకర్యాలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశమ్రలో మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా కంపెనీల యాజమాన్యాలు ఇలాంటి సౌకర్యాలను తొలగించింది. ఇదివరకు ఉద్యోగుల కోసం ‘ఫిజికల్ ఫిట్నెస్ సిబ్బంది కూడా ఉండేవారట. వారంతా కూడా కాలక్రమంలో కనిపించకుండా పోయారు. ఉద్యోగులే వారంతట వారే మానసిక వొత్తిడిని తగ్గించుకోవడానికి ‘మెడిటేషన్ లాంటి విద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారట!