వొరిస్సా, డిసెంబర్ 22: తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకాన్నే వొరిస్సా ప్రభుత్వం కూడా అమలు చేయనుంది. సీఎం కర్షక్ అసిస్టెంట్ పేరిట పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ పథకం కింద రూ. 10,180 కోట్లను వొడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. దీని ద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు కొనేందుకు వొక్కో రైతుకు రూ.10 వేలను అందజేస్తామని ఆయన తెలిపారు.
దీంతో పాటు వొక్కొక్క రైతుకు వడ్డీ లేకుండా రూ. 50 వేల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ భూమి లేని పేదలకు మేకలు, గొర్రెల పెంపకం, పుట్టగొడుగుల సాగు కోసం వొక్కొక్కరికి రూ. 12,500లను అందించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నారు.