హైదరాబాద్, డిసెంబర్ 05: తెలుగు చిత్రసీమ టాప్ హీరోలలో వొకరిగా కొనసాగుతోన్న మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అశ్వనీదత్, ‘దిల్ రాజు, పీవీపీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ నటిస్తుండగా, అల్లరి నరేశ్ మహేశ్ మిత్రుడిగా ‘రవి అనే పాత్రలో దర్శనమివ్వనున్నాడు.
మహర్షి చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులలో అమితానందాన్ని కలిగిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ కాలేజ్ స్టూడెంట్గా, బిజినెస్ మేన్గా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఆధునిక రైతుగాను కనిపిస్తాడని అంటున్నారు. మూడు దశలలో నడిచే కథలో మూడు డిఫరెంట్ షేడ్స్లో మహేష్ కనిపిస్తాడని చిత్రసీమ టాక్. ఇదే నిజమైతే అభిమానులకి ఇంతకి మించిన ఆనందం మరొకటి ఉండదనే చెప్పాలి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన భారీ విలేజ్ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు రెడీ చేస్తున్నారు.