బ్రిస్బేన్ , నవంబర్ 23: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని శిఖర్ ధావన్ బ్రేక్ చేశారు. టీ 20ల్లో వొక సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ధావన్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. గతంలో ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండగా.. ఇప్పుడది ధావన్ సొంతమైంది. బుధవారం ఆసీస్ తో టీం ఇండియా తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో భారత్ 4పరుగులు తేడాతో ఓటమి పాలైంది . అయితే.. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు.
లక్ష్యచేదనలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సారథ విరాట్ కోహ్లిలు విఫలమైనా ధావన్(42 బంతుల్లో 76; 10ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకంతో రాణించాడు. అయితే కంగారులపై ఆడిన చక్కటి ఇన్నింగ్స్కు ధావన్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది.
టీ20ల్లో వొక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పొట్టి ఫార్మట్ క్రికెట్లో వొక క్యాలెండ్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో) పేరిట ఉన్న రికార్డును తాజాగా ధావన్ అధిగమించాడు.