దిల్లీ,అక్టోబర్ 24: విభేదాలతో రచ్చకెక్కిన సీబీఐని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం రాకేష్ ఆస్తానా, అలోక్ వర్మ బృందాల్లో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని బదిలీల్లో టార్గెట్ చేసింది. తాజాగా 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా కేసు విచారిస్తున్న ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. అంతేగాక.. ఆస్థానాపై ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్న బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
సీబీఐ బదిలీలు చేసిన సీనియర్ అధికారుల్లో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్, డీఐజీ మనీష్ కుమార్ సింగ్, ఏసీబీ డీఐజీ తరుణ్ గౌబా, డీఐజీలు జస్బీర్ సింగ్, అనిష్ ప్రసాద్, కేఆర్ చురాసియా, రామ్ గోపాల్, ఎస్పీ సతీష్ దగార్, అరుణ్ కుమార్ శర్మ, ఏ సాయి మనోహర్, వి. మురుగేశన్, అమిత్ కుమార్లున్నారు.