ఢిల్లీ, జూన్ 25 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 10న ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సోమవారం తెలిపింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు తేదీలను ఖరారు చేశారు. 18 రోజుల పాటు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యంగ హోదా బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు సహా ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన సోమవారం ఉదయం పార్లమెంట్ కేబినెట్ వ్యవహారాల ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనంత్ కుమార్ పేర్కొన్నారు.