లక్నో, మే 31 : మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాలన్న సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు.. తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వెల్లడించారు. అంతేకాకుండా బంగ్లాకు సంబంధించిన తాళం చెవిలను స్పీడ్పోస్ట్ ద్వారా పంపారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్లతో పాటు మరో ముగ్గురు మాజీ సీఎంలకు ఆ నోటీసులు ఇచ్చారు. అయితే లక్నోలో మాయవతి పేరుమీద రెండు బంగ్లాలు ఉన్నాయి. ఒక బంగ్లాను ఆమె కాన్షీరామ్ బంగ్లాగా పేర్కొంటూ.. ఆ బిల్డింగ్ను వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే మరో బంగ్లాలో ఆమె సిబ్బంది ఉంటున్నారు. యూపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఆ బంగ్లాను ఖాళీ చేసేందుకు మాయావతి అంగీకరించారు. అయితే అధికారులు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. తాము ఖాళీ చేయాల్సిందిగా చెప్పింది లాల్బహదూర్ శాస్త్రి మార్గ్లోని బంగ్లా కాదని(మాజీ సీఎంలకు కేటాయించిన బంగ్లా).. విక్రమాదిత్య రోడ్లో ఐదు ఎకరాల్లో ఉన్న పది బెడ్రూమ్ల విలాసవంతమైన భవనాన్ని అని అధికారులు వెల్లడించారు.