సిమ్లా, మే 29 : దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిమ్లా ఇప్పుడు నీటి కష్టాలతో తల్లడిల్లిపోతుంది. గత వారం రోజుల నుండి అక్కడి ప్రజలు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. బక్కెట్ నీళ్లు తెచ్చుకోవడం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు సెలవుల సందర్భంగా సిమ్లా అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు నీళ్ల కష్టాలతో వెనుదిరుగుతున్నారు. ప్రజలకు సరిపడా నీటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నీటి ఇబ్బందులపై హిమాచల్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరిపడా నీళ్లను ఎందుకు విడుదల చేయలేకపోతున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రోహిత్ జమ్వాల్, ఇతర మున్సిపల్ అధికారులను న్యాయస్థానం ప్రశ్నించింది. నీటి ఎద్దడి లేకుండా అధికారులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.