బెంగళూరు, మే 28 : కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రధాని మోదీని సోమవారం సాయంత్రం కలవనున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్తోనూ మాట్లాడనున్నారు. రాష్ట్రంలో మంత్రి వర్గ కూర్పుపై వీరిద్దరూ చర్చించనున్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయబోమని అన్నారు. " రైతుల రుణమాఫీతో మా హామీల అమలు మొదలువుతుంది. రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని భాజపా బెదిరించింది. ఆ అవకాశం భాజపాకు ఇవ్వం. అలాంటి బెదిరింపులకు భయపడం. సంకీర్ణ ప్రభుత్వం కావడంతోనే కాంగ్రెస్తో చర్చించనిదే ఏ నిర్ణయం తీసుకొం. ప్రస్తుతం మంత్రివర్గ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటక ప్రజలు జేడీ(ఎస్)ను వద్దనుకుంటున్నట్లున్నారు. అందుకే ఎన్నికల ఫలితాల్లో మా పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. కానీ, ఈసారి ఫలితాలు మారుతాయి. 6.5కోట్ల కర్ణాటక రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకుంటాం. రాష్ట్రంలోని రైతులు ఎవరూ రుణమాఫీ విషయంలో ఆందోళన చెందవద్దు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది" అని కుమారస్వామి పేర్కొన్నారు.