జడేజా సతీమణిపై దాడి చేసిన కానిస్టేబుల్..!

SMTV Desk 2018-05-22 10:53:55  jadeja wife, Police Assaults reeva, jadeja wife Assaults, jam nagar

జామ్‌నగర్, మే 22 ‌: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినందుకుగాను కానిస్టేబుల్‌ ఆవేశంతో ఆమె జుట్టు పట్టుకొని తోసేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... జడేజా భార్య రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు రాంగ్ రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్ సజయ్ అహిర్ ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొంది. వెంటనే ఆగ్రహంతో ఆ పోలీసు కానిస్టేబుల్‌ రీవాను దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆమెపై చేయి కూడా చేసుకున్నాడని, జుట్టు పట్టుకుని లాగాడని స్థానికులు చెబుతున్నారు. వారంతా కలగజేసుకోవడంతోనే ఆ కానిస్టేబుల్‌ రీవాను వదిలేశాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులు రీవాను ఇంటికి పంపించేశారు. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం జడేజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ రోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ముంబయిలోని వాంఖడే మైదానంలో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది.