శబరిమల, జూలై 7 : శబరిమల దేవాలయంలో పాక్ కరెన్సీ సంచలనం సృష్టించింది. ఇటీవల దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే హుండీని తెరిచి భక్తుల కానుకలను నిర్వాహకులు లెక్కిస్తుండగా అందులో పాక్ కరెన్సీ బయటపడింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. హుండీలో విదేశీ కరెన్సీ వస్తుండడం సాధారణమే, కానీ పాకిస్థాన్ కరెన్సీ నోటు రావడంతో తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. పాతానంతిట్ట జిల్లాలోని శబరిమల స్వామి దేవాలయానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. నవంబర్ నుంచి జనవరి వరకు మూడు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల తొలిరోజు నుంచి ఓ ఐదు రోజులపాటు నెలవారి పూజల కోసం మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు. ఈ మేరకు అయ్యప్పస్వామి దర్శనానికై ఆ సమయంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు.