ఢిల్లీ, జూలై 6: డిల్లీలో ఆప్ ప్రభుత్వం అస్థిరత్వం దిశగా సాగుతోంది. 21 మంది పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైనవారు , అలాగే 8 కమిటీల ఛైర్పర్సన్లుగా నియమితులైనవారు, మొత్తం 29 మందికి లాభదాయక కేసులో అనర్హత వేటు పడే అవకాశం వుంది. ఈ విషయంలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఒక వేళ వీరిపై వేటు పడితే 70 స్థానాలున్నశాసనసభలో ఆప్ సంఖ్యాబలం 65 నుంచి 36కు పడిపోతుంది. ఈ 36 మందిలో దాదాపు 10 మంది భాజపాతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. అయినా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తొలి అడుగులు తాము వేయకూడదని భాజపా భావిస్తోంది. బీహార్ లో 243 స్థానాలున్న శాసనసభలో అత్యధికంగా ఆర్జేడీకి 80 మంది, జేడీయూకి 71 మంది, కాంగ్రెస్కు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భాజపాకు 53, ఇతర పార్టీలకు ఐదు స్థానాలు ఉన్నాయి. మహాకూటమి విచ్ఛిన్నమై ఆర్జేడీ నుంచి జేడీయూ విడిపోతే భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీయూకు అవకాశాలు ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ను మరల తమ పార్టీలో చేరాలని కోరారు ఎన్డీఏ భాగస్వామి ఎల్జేపీ అధినేత రామ్విలాస్ పాస్వాన్. భాజపాలోని ఒక సీనియర్ నేత మాత్రం నీతీశ్ కుమార్ తిరిగి రావాలంటే ఆయనే రావాలని అన్నారు. రాజకీయ అనిశ్చితి పరిస్థితులు వస్తే బీహార్, దిల్లీలపై వేచిచూసే దోరణి అవసరమని, ఆ రెండు రాష్టాలలో భాజాపా ప్రతిపక్షంలో వుందని అమిత్ షా వెల్లడించారు.