ఢిల్లీ, ఏప్రిల్ 28 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార, హత్య కేసులో మరో నిజం బయటపడింది. కుమారుడి చేసిన దుశ్చర్య ఎక్కడ బయటపడుతుందేమోననే భయంతోనే బాలికను చంపేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు ప్రధాన నిందితుడు సాంజిరామ్ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. తన కుమారుడితో పాటు మేనల్లుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమెను అపహరించిన నాలుగురోజుల తరువాత తనకు తెలిసిందని సాంజిరామ్ తెలిపాడు. హిందూ ప్రాబల్యం కొనసాగుతున్న ప్రాంతం నుంచి ముస్లిం సంచారజాతి వారిని తరిమివేయాలనే ఉద్దేశంతోనే బాలికను అపహరించామన్నాడు. అనూహ్యంగా సాంజిరామ్ కుమారుడు, మేనల్లుడు అత్యాచారం చేయడంతో, విషయం బయటపడకూడదని ఆమెను చంపేశామని అంగీకరించాడు.