న్యూఢిల్లీ , ఏప్రిల్ 23 : ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతీ మాలీవాల్ ఆదివారం నిరాహార దీక్షను విరమించారు. మహిళాపై జరుగుతున్నా అత్యాచారాలపై కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె పోరాడుతుంది. అత్యాచారాల కట్టడికి పటిష్ఠమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసిన స్వాతి.. 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారంచేసే వారికి మరణ శిక్ష విధించే అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్)ను స్వాగతించారు. కథువా, ఉన్నావ్లలో బాలికలపై అత్యాచారాల అనంతరం పది రోజుల క్రితం ఆమె రాజ్ఘాట్ వద్ద నిరాహార దీక్షకు ఉపక్రమించారు. దీక్ష విరమించిన తర్వాత స్వాతి మాట్లాడుతూ.. " ప్రతిరోజూ మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు.. ఇలా అత్యంత చిన్నవయసున్న బాలికలు దారుణ అత్యాచారాలకు గురవుతున్నారు. దీనిపై ఎన్నో లేఖలు రాశాను. నోటీసులు ఇచ్చాను. ప్రధాన మంత్రికి అయితే ప్రజల నుంచి వచ్చిన 5.5 లక్షల లేఖలు సమర్పించాను. కానీ ఫలితం లేకపోయింది. అందుకే నిరాహార దీక్ష చేపట్టాల్సి వచ్చింది" అని ఆమె వ్యాఖ్యానించారు.