హైదరాబాద్, జూలై 4 : ఎన్డీయే రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న విషయం తెలిసిందే, ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గరకు రావడంతో ఆయనకు మద్దతు పలికే పార్టీలను భేటీ అయ్యేందుకు హైదరాబాద్, విజయవాడను పర్యటించనున్నారు. కోవింద్ కు ఘనస్వాగతం పలికేందుకు అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముందుగా తెలంగాణలోని బీజేపీ, టీడీపీలతో పాటు తనకు మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్, వైసీపీ ప్రజా ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. ఎన్డీయే రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటించనుంది. భాగ్యనగరంలోని హయత్ హోటల్ లో ఉదయం 11 గంటలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కోవింద్ తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు రామనాథ్ కోవింద్ విజయవాడ వెళ్లనున్నారు. కోవింద్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్పోర్టులో స్వాగతం ఘన స్వాగతం పలకనున్నారు. ఎయిర్పోర్టులోనే బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయన కలవనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఏ కన్వెన్షన్ లో కోవింద్ గౌరవార్ధంగా చంద్రబాబు తేనిటీ విందు ఇవ్వనున్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.