సిరిసిల్లా, ఏప్రిల్ 13 : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. ఆ భయంతోనే టీజేఎస్ సభలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. శుక్రవారం రాజన్న సిరసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు భూకబ్జాలు, ఇసుక మాఫియా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీజేఎస్ ఎవరితోను పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వం ప్రజలు, రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని కోదండరాం విమర్శించారు.