హైదరాబాద్, మార్చి 28 : ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి మల్టీస్టారర్ సినిమాలను సైతం చేస్తూ వచ్చారు అక్కినేని నాగార్జున. అలాగే నటుడిగానే కాకుండా నిర్మాతగా నిరూపించుకున్నారు కథానాయకుడు నాని. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర౦లో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఉగాది పండగ రోజున ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించి, నాని.. రష్మిక మందన.. సంపూర్ణేష్ బాబుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్.. మియాపూర్ మెట్రో స్టేషన్ లలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు.