చెన్నై, మార్చి 17 : కమల్హాసన్ తన స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో తెరకెక్కించిన "విశ్వరూపం 2" చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. గతంలో వచ్చిన "విశ్యరూపం" చిత్రం ఎన్నో వివాదాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా కమల్ "విశ్వరూపం 2"ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రబృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో బీజీగా ఉంది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ బోర్డు "విశ్వరూపం 2" కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సినిమా తొలి భాగంలో ఉన్న పలు యాక్షన్ సన్నివేశాలు ఈ సీక్వెల్ లోనూ ఉన్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగానికి సంగీత త్రయం శంకర్-ఎసాన్-లాయ్ స్వరాలు సమకూర్చగా, రెండో భాగానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.