హైదరాబాద్, మార్చి 12 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని.. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా చేనేతలకు ఆసరాగా నిలుస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలిపారు.