హైదరాబాద్, జనవరి 31 : తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం మహా జాతర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జాతరలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఏర్పాట్లన్ని ఘన౦గా పూర్తి చేశారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. అడవిమార్గం గుండా పగిడిద్దరాజును గద్దెలవైపు తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభం కానుంది. కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. ముందు సమ్మక్క పూజారులు వనంలోకి వెళ్లి కంకబొంగు తెచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం మేడారం సమీపంలోని కన్నెపల్లి నుంచి పూజారులు సారక్కను తీసుకొస్తారు. మేడారంలోని గద్దెల ప్రాంగణంలో ఉన్న గద్దెలపై సమక్క, సారక్కను ప్రతిష్ఠిస్తారు. అనంతరం భక్తులు గద్దెల వద్దకు చేరుకొని దేవతలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటారు. అలాగే చివరిరోజు సాయంత్రం సమ్మక్కసారక్కలను తిరిగి వన౦లోకి చేర్చడంతో ఈ మహాజాతరకు తెరపడుతుంది.