హైదరాబాద్, జనవరి 13 : మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి హైదరాబాదుకు మాదక ద్రవ్యాలు తరలిస్తున్నరనే సమాచారంతో రాజేంద్ర నగర్, షాద్ నగర్ సమీపంలో సోదాలు నిర్వహించడంతో ఎనిమిది మంది పట్టుపడ్డారు. వారి నుంచి సుమారు రెండున్నర కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఎల్లనూరుకు చెందిన దాసరి బాబు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడని శంషాబాద్ డీసీపీ పద్మజా వెల్లడించారు. దాసరి బాబుపై గతంలో కూడా తాడిపత్రిలోని ఓ వర్గంపై బాంబులు వేసిన కేసు, కడపలో ఎర్రచందనం స్మగ్లింగ్, రద్దయిన నోట్ల చెలామణి, దొంగతనం కేసులు ఉన్నాయని ఆమె చెప్పారు. నిందితుడు ఎక్కువగా కడప నుంచి ఈ మాదకద్రవ్యాలను బెంగుళూరుకు సరఫరా చేసే వాడని తెలిపారు.