భువనగిరి, జనవరి 12: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు కేసీఆర్ను తిట్టినవారే నేడు ఆయన కేబినెట్లో కొనసాగుతున్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు వందశాతం సరైనవేనని శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేనివాళ్లు తెలంగాణ కేబినెట్లో ఉన్నారని ఆయన తెలిపారు. ఆ విషయం తలుచుకుంటే కళ్లవెంట నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని భావిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదని, తెలంగాణ లేదని ఆయన చెప్పారు. అప్పుడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్ళు ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన చెందారు.