నాగర్కర్నూలు, జనవరి 12 : ఉగాది తరువాత పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని భాజపా సీనీయర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ నెల 11న ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబొయ్యే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ప్రజలు కార్యకర్తల మనోభావాలే శీరోధార్యంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో భాజపాకు ఎదుగుదల లేదనే అభిప్రాయంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. కొందరు కార్యకర్తలు, నాయకులు తన దగ్గర ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారని, ఈ మేరకు ఉగాది తర్వాత నిర్ణయం తీసుకుందామని, అంతవరకు ఆగాలని చెప్పానన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయ ఐకాస కొంతకాలం క్రితం నాగంను సంప్రదించినట్లు చర్చ జరుగుతోంది. ఐకాస రాజకీయ పార్టీగా మారే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆయన ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, తెరాసల్లో ఏపార్టీలోకి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, పంచాయతీ రాజ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, సర్పంచ్ ఎన్నికలను అడ్డుకోవడానికే కేసీఆర్ ఈ ఎత్తు గడ వేసినట్లు నాగం ఆరోపించారు.