హైదరాబాద్, జనవరి 10 : గత కొద్దీ రోజులుగా నగర వాసులకు అలజడి రేపుతున్న చెడ్డీ గ్యాంగ్ మరోమారు రెచ్చిపోయింది. ఈ గ్యాంగ్ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండాపోతుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ శివారులోని మియాపూర్ ప్రాంతంలో దోపిడీకి పాల్పడిన చెడ్డీగ్యాంగ్, ప్రస్తుతం మీర్పేట అగ్రికల్చర్ కాలనీలో మరోసారి భారీ చోరీకి పాల్పడింది. ఓ ఇంట్లో వాచ్మెన్ను బంధించిన దుండగులు 11 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. చోరీ జరిగిన తీరును బట్టి ఇది చెడ్డీగ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ చెడ్డీ గ్యాంగ్ అరాచకం వెలుగుచూసింది. దీంతో ఈ గ్యాంగ్ హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు జంప్ అయ్యిందని అందరూ అనుకున్నారు. కానీ, హైదరాబాద్లో ఇంకా అలాంటి గ్యాంగ్లు తిరుగుతున్నాయని దొరికిన ఆనవాళ్లతో నిర్ధారణ అయ్యింది. దీంతో చెడ్డీ గ్యాంగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో కూడా మరోసారి వాళ్ల ఆనవాళ్లు చిక్కడంతో, పోలీసులు తీవ్రంగా ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా అనుమానీతులుగా కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు.