హైదరాబాద్, జనవరి 08: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హాస్యనటుడు గుండు హనుమంతరావు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవలే హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి సినీ పెద్దలకు, ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. అయితే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఇతనికి మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్న విషయం తెలిసిందే.