హైదరాబాద్, జనవరి 5 : నేడు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో టి.కాంగ్రెస్ నేతలు రాజ్భవన్లో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటిలో పలు ఆసక్తికర అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చల్లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టు తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా, కొత్త ఏడాదిలో ప్రభుత్వానికి సహకరించాలని గవర్నర్ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి గవర్నర్గా కాకుండా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తుండటం సరికాదని చెప్పినట్టు సమాచారం. ఇలా వీరి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు వాగ్వాదం జరిగినట్టు పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు.