హైదరాబాద్, జనవరి 3 : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి సంబధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఈ కమిషన్ చైర్మన్గా దళిత నాయకుడు, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురు సభ్యులను కూడా నియమించారు. సభ్యులలో బోయిళ్ల విద్యాసాగర్(సూర్యాపేట జిల్లా), ఎం.రాంబాల్ నాయక్(రంగారెడ్డి జిల్లా), కుర్సం నీలాదేవి(ఆదిలాబాద్ జిల్లా), సుంకపాక దేవయ్య(హైదరాబాద్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా) ఉన్నారు. చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో బాలవ్వ, విజ్జయ్యలకు 1979 మే 5న జన్మించారు. 2007 నుంచి 2010 వరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆగస్టు 30 2010 నుండి కమిటీ రద్దయ్యే వరకు టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగారు.