హైదరాబాద్, జనవరి 03 : పని ఒత్తిడితో జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమని మంత్రి సూచించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ అరుణ్సాగర్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డుల కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న మంత్రి హరీశ్ ఈ ఏడాది అవార్డులు అందజేశారు. అరణ్య వ్యాసం పేరుతో కథనాన్ని అందించిన "ఈటీవీ" ఆదిలాబాద్ జిల్లా విలేకరి మాణికేశ్వర్ కు ఉత్తమ జర్నలిస్టు అవార్డును మంత్రి ప్రధానం చేశారు. ప్రజాకవి గోరటి వెంకన్నకు అరుణ్సాగర్ సాహితి పురస్కారం ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, ఎంపీ బాల్క సుమన్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.