హైదరాబాద్, డిసెంబర్ 29 : హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్, కాలుష్య కష్టాలను కాస్తైనా తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రయాణం ఇక భారంగా మారనుంది. ఎంతో అట్టహాసంగా నవంబర్ 28 న ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణ౦పై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. దీంతో ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ప్రయత్నం మూన్నాళ్ళ ముచ్చటగానే మారనున్నట్లు తెలుస్తోంది. అయితే చార్జీలు ఎక్కువగా ఉండడం, స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, సరైన వసతులు లేకపోవడంతో నగరవాసులు మెట్రోలో రోజువారీగా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ప్రయాణికులు కేవలం అత్యవసర పరిస్థితులలో, బంధువులు, స్నేహితులతో కలిసి ఏదో సరదాగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కాగా మొత్తం 16 రైళ్లను నడుపుతుండగా.. మియాపూర్ నుంచి అమీర్పేట, అమీర్పేట నుంచి నాగోల్ వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.