ఆదిలాబాద్, డిసెంబర్ 18 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణయుత వాతావరణం సర్దుమనుగుతుంది. స్వయంగా పరిస్థితులకు అంచనా వేసేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉట్నురుకు చేరుకున్న డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ కు, ఆ తర్వాత ఆదిలాబాద్ చేరుకున్నారు. రెవెన్యూ ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య జరుగుతున్న ఘర్షణను మావోయిస్టులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యువత ఆ వలలో చిక్కుకోకూడదని హితవు పలికారు. పోలీసులు సైతం ప్రజలతో మమేకమై సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన వెల్లడించారు.