హైదరాబాద్, డిసెంబర్ 17 : హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నిర్మిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 10న విడుదలయ్యే ఈ సినిమాలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్నారు. అలాగే, ఖుష్బూ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, శనివారం విడుదలైన అజ్ఞాతవాసి ప్రచార చిత్రాలకు మంచి స్పందనతో పాటు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఆ విడుదలైన చిత్రాల్లో ఖుష్బూ కనిపించలేదు. దీంతో తాజాగా ఖుష్బూ ‘అజ్ఞాతవాసి’ సినిమా కొత్త పోస్టర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఆమెతోపాటు పవన్ ఉన్నారు. ఖుష్బూ కుర్చీలో కూర్చొని కోపంగా చూస్తుంటే.. పవన్ ఆమె వెనుక నిల్చొని అంతే కోపంగా చూస్తున్నారు. దీని బట్టి ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇలాంటి విలువైన పాత్ర కోసం ఎదురుచూశానని ఈ సందర్భంగా ఖుష్బూ ట్వీట్ చేశారు. తనను నమ్మి ఆ పాత్రకు ఎంపిక చేసిన దర్శకుడు త్రివిక్రమ్కు ధన్యవాదాలు చెప్పారు.